సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాషణ్ రెడ్డి(76) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుధవారం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రి (ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ)లో చికిత్స పొందుతూ ఆయన ఇవాళ ఉదయం మరణించారు.సుభాషన్ రెడ్డి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు.
జస్టిస్ సుభాషణ్ రెడ్డి 1942 మార్చి 2న హైదరాబాద్లో జన్మించారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. మరొక కుమారుడు ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. సుభాషణ్ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్లోని ఆయన నివాసానికి తరలించారు. సాయంత్రం మహాప్రస్థానంలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.