కొలంబో: గత ఆదివారం శ్రీలంకలో వరుస బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడుల అనంతరం శ్రీలంక సర్కార్ అప్రమత్తమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో బుర్కాను నిషేధిస్తూ అధ్యక్ష కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఉగ్రదాడుల్లో బుర్కా వేసుకున్న మహిళల పాత్ర ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలు బుర్కా ధరించడం ద్వారా తమ గుర్తింపును దాచడానికి ప్రయత్నించకూడదని ఆదేశాల్లో పేర్కొంది. సోమవారం నుంచే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన కార్యాలయం పేర్కొంది. అత్యవసర నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రజా రక్షణ కోసమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్టు లంక అధ్యక్షుడు తెలిపారు. కాగా, ఉగ్రదాడుల ప్రభావం ఈ ఆదివారం కూడా కనిపించింది. ఇప్పటికీ శ్రీలంక ప్రజలు చర్చిలకు వెళ్లాలంటే భయపడుతున్నారు. కల్మునై, సమంథురై, చవలకడె ప్రాంతాల్లో కర్ఫ్యూ ఎత్తివేసినప్పటికీ ఎవరూ చర్చ్లవైపు రావడానికి సాహసించడం లేదు. మరోవైపు అనుమానిత ఉగ్రవాదుల కోసం ఆర్మీ బలగాలు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నాయి.