కొలంబో: శ్రీలంకలో జరిగిన వరుస బాంబు దాడులకు నైతిక బాధ్యత వహిస్తూ శ్రీలంక రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం తన పదవికి రాజీనామా చేశారు. అధ్యక్షుడు మైత్రీపాల సిరిపేన అభ్యర్థన మేరకు ఫెర్నాండో తన రాజీనామాను సమర్పించారని కొలంబో గజెట్ వార్తాసంస్థ తెలిపింది. పేలుళ్లు జరగవచ్చంటూ ముందస్తు ఇంటెలిజన్స్ సమాచారం అందినప్పటికీ వాటిని ఆపలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ రక్షణ కార్యదర్శి, పోలీసు ఐజి పుజిత్ జయసుందర రాజీనామా చేయాలని అధ్యక్షుడు సిరిసేన బుధవారం కోరిన విషయం తెలిసిందే. తనవైపునుంచి వైఫల్యం ఏమీ లేకపోయినా తన ఆధ్వర్యంలోని కొన్ని ఏజన్సీల వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఫెర్నాండో చెప్పారు. కొలంబోలో గత ఆదివారం జరిగిన తొమ్మిది ఆత్మాహుతి దాడుల్లో 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయపడిన విషయం తెలిసిందే.