మే 23తో ఏపీలో చంద్రబాబు పీడ విరగడ అవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షుడు మేరిగ నాగార్జున అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోరే నాయకుడు రాష్ట్రానికి అవసరమని, ఆ క్రమంలోనే ప్రజలు స్పష్టమైన తీర్పును ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. ప్రజల కష్టాలు తీర్చలేని దద్దమ్మల్లా టీడీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు వ్యవస్థను జేబు సంస్థగా మార్చారని మేరిగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ రోజు మేరిగ నాగార్జున గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీపై, చంద్రబాబుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారీ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో మంచినీటి సమస్య అధికమవడంతో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారన్నారు. ప్రజల ఇక్కట్లు, వారి బాగోగులు చూడలేని చవట దద్దమ్మల్లా ఉన్న మీరు అధికారంలో ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటేనని మేరిగ నాగార్జున విమర్శించారు.