పాకిస్థాన్, ఆగస్ట్ 17: పాకిస్థాన్లో బాలికల చదువు కోసం తాలిబన్లను సైతం లెక్కచేయకుండా పోరాడిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్ జాయ్ యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం దక్కింది. యూనివర్సిటీలో తనకు సీటు కేటాయిస్తూ ఆక్స్ఫర్డ్ వారు పంపిన మెసేజ్ను ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు చేరవేశారు. ఈ నేపధ్యంలో ఆమె అక్కడ రాజకీయ, ఆర్థిక శాస్త్రాలతో పాటు ఫిలాసఫీలను చదువుకోనున్నారు. యూనివర్సిటీకి వెళ్లడానికి చాలా ఆత్రుతగా ఉన్నానంటూ ఆమె తన ట్వీట్లో వెల్లడించారు. ఈ ఏడాది మొదట్లో ఐక్యరాజ్యసమితి శాంతిదూతగా మలాలాను నియమించిన విషయం తెలిసిందే.