ఖర్తూమ్: సూడాన్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనీ ఆ దేశ సైనిక పాలకులకు విపక్షం డిమాండ్ చేసింది. సూడాన్లో సైనిక కుట్రను విపక్షాలు నిరసిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అక్కడ వెంటనే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో పాటు మరికొన్ని డిమాండ్లతో కూడిన జాబితాను శనివారం నాడు ఆ దేశ సైనిక పాలకులకు అందచేసింది. శనివారం నాడు పదిమంది సభ్యుల తమ ప్రతినిధి బృందం సైనిక ప్రభుత్వానికి డిమాండ్ల జాబితాను అందచేసిందని సైనిక కుట్రకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహిస్తున్న అలయెన్స్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఛేంజ్ ఒక ప్రకటనలో వివరించింది. కాగా వెంటనే పౌర ప్రభుత్వం ఏర్పాటు ఏయాలని సైనిక ప్రభుత్వంపై వత్తిడి చేస్తూ వేలాది మంది ప్రజలు సైనిక ప్రధాన కార్యాలయం ఎదుట ఆదివారం కూడా భారీయెత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకూ తాము ఆందోళన కొనసాగిస్తామని ప్రతిపక్ష కూటమి నేతల్లో ఒకరైన ఉమర్ ఎల్డిగర్ చెప్పారు.