నంద్యాల, ఆగస్ట్ 16: నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వైకాపా ఎమ్మెల్యే రోజా, ఎంపీ బుట్టా రేణుక పెద్దకొట్టాలలో నిర్వహించిన రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ ఎవరివో చెప్పాలంటూ, తనకు మీడియా లేదని జగన్ అసత్య ప్రసారం చేస్తున్నారంటూ నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ... పాపం బాలకృష్ణకు ఏమి తెలియదు అమాయకుడు, ఆయనకు రాసిచ్చిందే మాట్లాడారని ఆమె తెలిపారు. పెద్దకొట్టాల రోడ్ షోలో రోజా మాట్లాడుతూ... టీడీపీ నేత భూమా నాగిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వల్ల కలిగిన ఒత్తిడి కారణంగా మరణించారని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు ప్రజల్ని ఎన్నికల సమయంలోనే ప్రేమిస్తారు, ఏరు దాటేంత వరకు ఏటి మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్నఅన్నట్టుగా చంద్రబాబు నైజం ఉందని ఆరోపించారు.