వైసీపీకి 20 కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు.. ఎంఐఎం అధినేత

SMTV Desk 2019-04-08 21:23:27  aimim, assasuddin, Jagan

వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ గెలవడం చరిత్రాత్మక అవసరం. ఎన్నికల్లో భారీ మెజారిటీతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం. మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్ ప్రజల కష్టాలను దగ్గరుండి చూశారు. వైఎస్సాఆర్ వారసుడిగా ఏపీకి పూర్వ వైభవం తీసుకొచ్చే సత్తా ఉన్న నాయకుడు జగనే. జగన్ కు ఒక విజన్ ఉంది. మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో జగన్ హవా నడుస్తోంది. రావాలి జగన్.. కావాలి జగన్ నినాదమే వినిపిస్తోంది ఎక్కడైనా.. అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

వచ్చే ఎన్నికల్లో జగన్ ఖచ్చితంగా సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు. అంతే కాదు ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 20 కి పైగా ఎంపీ సీట్లు, 130కి పైగా ఎమ్మెల్యే సీట్లు వస్తాయట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక లెజండ్ అని… ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడని ఓవైసీ కొనియాడారు. ఆయన చేసిన మేలును ముస్లింలు ఏనాడూ మరిచిపోరన్నారు. అందుకే ఏపీలోని ముస్లింలంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉన్నారన్నారు. ముస్లింలే కాదు.. అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్ కు అండగా ఉన్నారన్నారు.

చంద్రబాబుపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఓవైసీ అన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని.. ముస్లింలకు ఆయన చేసినంత అన్యాయం ఎవరూ చేయలేదన్నారు. నాలుగేళ్ల పాటు బీజేపీతో కలిసి తిరిగిన చంద్రబాబు.. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం బీజేపీతో కయ్యానికి దిగారన్నారు. ఎన్నికలు కాగానే.. బాబు మళ్లీ బీజేపీ పంచన చేరుతారని ధ్వజమెత్తారు. బీజేపీతో ఒక్కసారి కాదు.. చంద్రబాబు రెండు సార్లు పొత్తు పెట్టుకొని… జగన్ కు, మోదీకి పొత్తు ఉందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. మోదీతో జగన్ కలవడం అనేది శుద్ధ అబద్ధమని స్పష్టం చేశారు.