ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తన చేతిలోకి వచ్చేసిందని జగన్ కలలు కంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి మా పిల్లలను జైలు పాలు చేసుకోమంటారా? అని విజయమ్మను ఆమె ప్రశ్నించారు. జగన్ కు సహకరించిన అధికారులంతా జైలు పాలు అయ్యారని ఆమె విమర్శించారు. అవినీతి ముద్దు బిడ్డ అయిన జగన్ ఏపీకి నిష్ట దరిద్రంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అవసరమైతే మీ బిడ్డను ఇంట్లో ఉంచుకోండి. కానీ తల్లి ప్రేమ, వాత్సల్యాన్ని అడ్డుపెట్టుకుని ఏపీలోని భవిష్యత్ తరాల జీవితాలను పణంగా పెట్టొద్దని కోరుతున్నా’ అని చెప్పారు. తమ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని ఏపీలోని తల్లులను యామిని కోరారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అసలు అధికారంలోకి రాకుండానే జగన్ లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని వాన్ పిక్, లేపాక్షి రూపంలో వేలాది ఎకరాలు దోచేశారన్నారు. అమ్మాయిలపైనా అరాచకాలు చేశారని ఇలాంటి అరాచక వ్యక్తుల ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైపోతామోనని ఏపీ ప్రజలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. జగన్ అరాచకవాదిగా మారడానికి విజయమ్మ పెంపకమే కారణమని ఆరోపించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉన్నప్పుడు జగన్ అరాచకాలను భరించలేక బెంగళూరులో ప్యాలెస్ లు కట్టి ఆయన్ను అక్కడకు పంపేశారని వ్యాఖ్యానించారు. జగన్ కుటుంబం మొత్తం తేడానేనని దుయ్యబట్టారు. కొన్ని వలస పక్షులను పులికాట్ సరస్సు వద్ద చూస్తుంటాం. నిర్ణీతమైన సమయంలోనే అవి అక్కడకు వచ్చి, తిరిగి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారు. మామూలుగా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అనుకున్నాం. కానీ కుటుంబం మొత్తం మానసిక పరమైన తేడా అని ఆమె విమర్శించారు.