సీఎం పదవి కోసం 1500కోట్లు ఇస్తానని జగన్ ఆఫర్ !

SMTV Desk 2019-03-27 11:11:33  Jagan, Jagan Mohan reddy,

ఓవైపు ఎండలు.. మరోవైపు రాజకీయ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కిపోయాయి… ఇక టీడీపీ తరపున రంగంలోకి దిగిన జాతీయ నేతలు కూడా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి కడపలో ప్రచారం నిర్వహించిన జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా జగన్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత సీఎం పదవి కట్టబెడితే రూ.1500 కోట్లు ఇస్తానని కాంగ్రెస్ అధిష్ఠానానికి వైఎస్ జగన్ ఆఫర్ చేశాడని ఫరూక్ ఆరోపించారు.

ఇక అవినీతి సొమ్ముతో సీఎం పీఠం ఎక్కాలని చూసిన జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్ అంధకారమవుతుందన్నారు. జగన్‌కు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు సీఎం కావడానికి జగన్ ఎంతకైనా తెగిస్తాడని హెచ్చరించారు. అవినీతి, అక్రమాలతో కోట్లు సంపాదించి పదవులు దక్కించుకుందామంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న ఫరూఖ్‌.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల కోసం తాపత్రయపడే సీఎం చంద్రబాబునే తిరిగి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల ప్రచారం కోసం నిన్న అమరావతి చేరుకున్న ఫరూఖ్ అబ్దుల్లా ఇవాళ చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.