అమరావతి, ఆగష్ట్ 8: నంద్యాల బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు నాయుడిని నడి రోడ్డుపై నిలబెట్టి కాల్చిన తప్పు లేదంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. అయితే జగన్ ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ... 2014 ఎన్నికల్లో టీడీపీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చాలా వాగ్దానాలు చేసి, వాటిని నెరవేర్చకుండా గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల మ్యానిఫేస్టోలో కూడా వాటిని వెల్లడించారు, కానీ నెరవేర్చలేదనే ఆవేదనలో తాను సభలో అలా వ్యాఖ్యానించానని తెలిపారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల ప్రచారం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. అయితే ఎవరి బలం ఎంత అనేది తెలియాలంటే ఈ నెల 29వ తేదీ వరకు వేచి చూడాలి.