ఇస్లామాబాద్, మార్చ్ 08: ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పై పాకిస్తాన్ ప్రభుత్వం కేసు పెట్టింది. మొన్నే పాకిస్తాన్ ఆర్మీ నుండి భారత్ కు తిరిగి వచ్చిన అభినందన్ పై పాక్ కేసు పెట్టడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అలాగే పాక్ ఆడుతున్న మరో నాటకం అని మరికొందరు పాక్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక విషయానికొస్తే పాక్ మొదటి నుండే తమ భూభాగంలో ఎలాంటి దాడులు జరగలేదని బుకాయిస్తూ వస్తోంది. కేవలం ఖాళీ ప్రదేశాల్లో బాంబులు వేసి వెళ్లారని నమ్మిస్తోంది. పాకిస్తాన్ వ్యాఖ్యలకు బలం చేకూర్చుకునేలా ఓ వింత చర్యకు పాల్పడింది. తమ భూభాగంలోనికి చొచ్చుకొని వచ్చిన భారత వింగ్ కమాండర్ దాడిలో అనేక చెట్లు కూలిపోయాయని కేసు పెట్టారు. పాకిస్తాన్ అటవీ శాఖ ఈ కేసు నమోదు చేసింది. తమకు ఎలాంటి దాడి జరగలేదని.. నష్టం కూడా లేదని.. ఆర్మీకి దీంతో సంబంధం లేదన్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికే ఇలా అటవీ చట్టాల కింద కేసు వేసింది. తద్వారా మేం కొన్ని చెట్లు మాత్రమే కోల్పోయాం అనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ప్రయత్నించింది. అటవీశాఖ పిర్యాదును అనుసరించి పాకిస్తాన్ ప్రభుత్వం పర్యావరణ నష్టంపై ఐక్యరాజ్య సమితిలో పిర్యాదు చేయనున్నట్లు పాక్ మీడియా తెలిపింది.