అమరావతి, మార్చ్ 5: డేటావార్ విషయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జికే ద్వివేద పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, ఒకవేళ తమ సిబ్బంది తప్పు చేస్తే సస్పెండ్ అవుతారని జికే అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కి పైగా కేసులు నమోదయ్యాయని, ఓట్లు ఎక్కడ తొలగించామో ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. ఐటి గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ కమీషనర్ సజ్జనార్ చెప్పాలన్నారు. డేటా ఎలా వచ్చిందో, ఎక్కడ నుంచి వచ్చిందో తేల్చాల్సింది పోలీసులేనని ద్వివేది పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పనితీరుపై సందేహాలు వద్దని ద్వివేది మరోసారి స్పష్టం చేశారు. ఓట్ల తొలగింపుతో డూప్లికేట్ దరఖాస్తులు తగ్గిపోయాయన్నారు. ఓట్ల తొలగింపు కోసం మోసం చేస్లే ఈసి చూస్తూ ఊరుకోదని, రాజకీయ విమర్శలతో తమకు సంబంధం లేదని, ఎన్నికల సంఘానికి దురుద్దేశాలు ఆపాదించడం సరికాదని ద్వివేది వ్యాఖ్యానించారు.