అమరావతి, ఫిబ్రవరి 26: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు వారి అత్యుత్సాహానికి భారి మూల్యం జనసేన పార్టీ చెల్లించాల్సి వస్తోంది. అసలు విషయం... ఆదివారం పవన్ కర్నూలులో బహిరంగ సభ నిర్వహించారు. కాగా, ఈసభకు వచ్చిన ఆయన అభిమానులు కర్నూలు చారిత్రక కట్టడం అయినా కొండారెడ్డి ఖిల్లాని ధ్వంసం చేశారు. దాదాపు వేయి మంది కొండారెడ్డి ఖిల్లాలోకి చొరబడ్డారు. జనసేన జెండాలను ప్రదర్శిస్తూ గోడల మీదికి ఎక్కారు. బారికేడ్లను తన్నేశారు.
అయితే ఈ సంఘటనలో దాదాపు 200 పూలకుండీలు నాశనమయ్యాయి. స్టీల్ రెయిలింగ్స్ వంగిపోయాయి. మెట్లు, బెంచీలు ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ఈ నష్టానికి జరిగిన పరిహారాన్ని తాము చెల్లిస్తామంటూ జనసేన పార్టీ ముందుకు వచ్చినట్లు సమాచారం. కొండారెడ్డి ఖిల్లాని ధ్వంసం చేసినందుకు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వగా, దానిని ఇప్పుడు కొట్టివేసినట్లు సమాచారం. డ్యామేజ్ కి ఎంత అయినా చెల్లిస్తామని జనసేన ఆఫర్ చేసిందట. అందుకే కేసు కొట్టేసి, పార్టీ ఆఫర్ ని సంబంధిత అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది.