హైదరాబాద్,జనవరి 27: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎన్టీఆర్ అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని జగన్ ఇంటికి ఈరోజు కుమారుడు హితేశ్ తో కలిసి దగ్గుబాటి వెంకటేశ్వరావు చేరుకున్నారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి వాళ్లను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకెళ్లారు. దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ నేతగా, ఎయిరిండియా బోర్డులో స్వతంత్ర డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు జరుగుతున్నట్టు అర్ధం అవుతుంది. ప్రకాశం జిల్లాలో పర్చూరు స్థానంపై దృష్టిసారించిన దగ్గుబాటి దంపతులు తమ కుమారుడు హితేశ్ చెంచురాంను ఇక్కడి నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు, బీజేపీ లో వున్నఅతని భార్య పురందరేశ్వరి వారి కుటుంబసభ్యులు మొత్తం త్వరలోనే వైసీపీలో చేరే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పర్చూరు స్థానంపై జగన్ నుంచి హామీ లభిస్తే త్వరలోనే వారు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వినికిడి. ఇందుకు సంబంధించి వైసీపీ అధినేత జగన్ అభిప్రాయం ఏంటో ఇంకా వెల్లడి కాలేదు.