అమరావతి, జనవరి 24: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి ఇప్పటికే దాదాపు రాష్ట్రమంతా పర్యటించారు. ఇంకా మిగిలిన నియోజకవర్గాలను కవర్ చేయడం కోసం త్వరలోనే బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్బంగా ఏపీలోని స్వతంత్ర అభ్యర్థుల్ని ఆకర్షించేందుకు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాలలో ఓటర్లను ప్రభావితం చేయగల ఇండిపెండెంట్ వ్యక్తులకు లేఖలు రాయాలని జగన్ నిర్ణయించారు. ‘అన్న పిలుపు' అనే పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఆయా ప్రాంతాలో తాను చూసిన సమస్యలను ఈ లేఖలో జగన్ వారికి వివరించనున్నారు.
ఇక ఈ లేఖలో ఆ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించడానికి కలిసిరావాలనీ, సలహాలు, సూచనలు అందించాలని కోరనున్నారు. జగన్ నియమించుకున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ టీమ్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగి స్వతంత్ర వ్యక్తుల వివరాలు సేకరించింది. ఈ నేపథ్యంలోనే జగన్ వారందరికీ లేఖలు రాయనున్నారు. అనంతరం వారందరిని స్వయంగా కలిసి చర్చలు జరపనున్నారు.