మాస్కో, జూలై 31 : డోనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో రష్యా జోక్యం చేసుకోవడంతో రష్యా పై కఠిన ఆంక్షలు విధించేందుకు అమెరికా సిద్దమైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అంతే స్థాయి ప్రతి చర్యలకు దిగారు. రష్యా పై ఆంక్షలకు సంబంధించిన దస్త్రాన్ని ఆమోదించిన అమెరికన్ కాంగ్రెస్, దానిపై ఆమోద ముద్ర కోసం అధ్యక్షుడు ట్రంప్ నకు పంపించడంతో, రష్యాలో ఉన్న 755 మంది దౌత్యవేత్తలు తక్షణం దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని పుతిన్ ఆదేశించారు. రష్యాలో ప్రస్తుతం అమెరికా దౌత్యవేత్తలు 1000 పైగా ఉండగా ఆ సంఖ్య 450కు తగ్గించాలని రష్యా విదేశాంగ శాఖ ఇటీవల ఆదేశించింది. అయినప్పటికీ వారంతా రష్యాలోనే విధులు నిర్వహిస్తుండగా అమెరికా ఆంక్ష నేపథ్యంలో పుతిన్ తాజా ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో తమ దౌత్యవేత్తలు 455 మంది మాత్రమే ఉన్నందున, రష్యాలో కూడా యుఎస్ సిబ్బంది అంతే సంఖ్యలో ఉండాలని తేల్చి చెప్పారు. తమపై ఆంక్షలు విధిస్తే అమెరికాతో సంబంధాల్ని దీర్ఘకాలం పాటు తెగతెంపులు చేసుకునేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.