అమరావతి, జనవరి 22: వైసీపీ కీలక నేత బొత్స నారాయణ తెదేపా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక టీడీపీ పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ రాత్రి బీజేపీతో, పగలు కాంగ్రెస్ తో చేతులు కలుపుతుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీతో పొత్తు లేదంటూనే అయ్యన్నపాత్రుడు గడ్కరీని పొగిడారా అంటూ నిలదీశారు. అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కాపులకు 5శాతం రిజర్వేషన్లు పరిమితం చెయ్యడం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీపై నమ్మకం లేకనే నేతలు ఆ పార్టీని వీడుతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో త్వరలో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం సన్నగిల్లిందన్నారు. ప్రజలంతా వైసీపీవైపే ఉన్నారని స్పష్టం చేశారు. ఇకనైనా టీడీపీ నేతలు మోసాలు, మాయమాటలు కట్టిపెట్టాలని సూచించారు. ప్రజలను గందరగోళానికి గురిచేయడం ఆపాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.