అమరావతి, జనవారి 22: ఆంధ్రప్రదేశ్ భాజపా శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు బీజేపీకి రాజీనామా చేసి పార్టీ మారనున్నట్టు వచ్చిన వార్తలపై స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, ఎవరో కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన 40 లక్షల మంది సభ్యులున్న బీజేపీకి ఏమీకాదన్నారు. ఆయన ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను విమర్శించడం మానేశారని, పవన్ కళ్యాణ్ గాలి కూడా కాస్త మారినట్లు అనిపిస్తోందని అన్నారు. అతి త్వరలోనే చంద్రబాబు తీసుకునే మరో యూటర్న్ ను చూడనున్నామని విష్ణుకుమార్ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు కేంద్రం నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తూ, కడప ఉక్కు పరిశ్రమ, రామయపట్నం పోర్టులకు శంఖుస్థాపనలు చేసారు. రైల్వేజోన్ ను కూడా తానే ఏర్పాటు చేసానని ప్రకటించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పెన్షన్లు పెంచారని ఆరోపించారు. తాను ఎన్నో అవినీతి కుంభకోణాలను బయట పెట్టానని, అసెంబ్లీలో పోరాడానని, తనను తిరిగి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని చెప్పారు. ఎన్నికల్లో తాను ఓడిపోయి ఇంట్లో ఉంటే, ఆ నష్టం ప్రజలకేనని వ్యాఖ్యానించారు.