అమరావతి, జనవరి 17: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల, తనపై సామజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, తప్పుడు వార్తలుతో దుష్ప్రచారం చేస్తున్నారని చేసిన ఫిర్యాదులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపిపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని, సోషల్ మీడియాలను దుర్వినియోగం చేసింది వైఎస్ఆర్సిపినే అని చంద్రబాబు ఆరోపించారు.
జగన్ కేసులపై విచారణ సాగకుండా చేయాలని కుట్రలు చేశారన్నారు. చివరికి న్యాయమూర్తులపైనా దుష్ప్రచారానికి తెగబడ్డారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై, టిడిపి మహిళా నేతలపై, తన కుటుంబంపై అసభ్యకరంగా ప్రచారం చేశారని తెలిపారు. సోషల్ మీడియాను ఎవరు దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.