అమరావతి, జనవరి 7: రాయలసీమ ప్రాంతానికి కృష్ణా మిగులు జలాలు అందించేందుకు రూ.2.50కోట్ల వ్యయంతో హంద్రీనీవా ద్వారా మద్దికెర మద్దమ్మకుంటకు నీటిని నింపే పథకాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణ మూర్తి ప్రారంభించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాయలసీమకు కృష్ణా మిగులు జలాలు అందించేందుకు అప్పట్లో ఎన్టీఆర్ హంద్రీనీవా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అప్పటి ఎన్టీఆర్ కలను ఇప్పుడు చంద్రబాబు నిజం చేశారని ఆయన చెప్పారు.
చంద్రబాబు ప్రధాని అవుతారేమోనని మోదీ భయపడుతున్నారని కేఈ పేర్కొన్నారు. అందుకే కావాలనే చంద్రబాబుపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రూ.40కోట్లు అవినితీకి పాల్పడి.. 16నెలలు జైలు జీవితం గడిపిన జగన్ టీడీపీ అవినీతిపై పుస్తకం విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.