గుంటూరు, డిసెంబర్ 31: గుంటూరు లాల్పురం వద్ద గుంటూరు- చిలకలూరిపేట రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురువిద్యార్థులు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఓ కారు డివైడర్ను బలంగా ఢీకొని అదే వేగంతో ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ఢీకొట్టిన వేగానికి లారీ సైతం బోల్తా పడింది.మృతులను ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.
వీరంతా వొకే కార్ లో ప్రయాణిస్తున్నారు. న్యూ ఇయర్ పార్టీ వేడుకలో భాగంగా విజయవాడ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు వొక అంచనాకు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయం లో కార్ 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ధనుష్, సాయిరామ్ , కోటేశ్వరరావు, కపూర్ మృతిచెందారు. మృతులంతా 20 ఏళ్లలోపు వారే. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుంటూరు జీజీహెచ్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్కు కూడా గాయాలయ్యాయి.