విజయవాడ, నవంబర్ 24: ఆంధ్ర ప్రదేశ్ విపక్ష నేత జగన్ కోడికత్తిపై రాద్ధాంతం, రాజకీయం చేశారు. కానీ, నేను అలా చేయను. నా భద్రతా సిబ్బంది వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టింది. వాహనంలోని 8 మంది గాయపడ్డారు. మరికొన్ని గంటల్లోనే హైదరాబాద్లో మా నాయకుడు నాదెండ్ల మనోహర్ వాహనాన్ని కూడా ఇసుక లారీ కొట్టింది. మేం జగన్లా గోల చేయలేదుగ అని జనసేన పార్టీ అధిపతి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వొక కోడి కత్తి గుచ్చినందుకు గుచ్చారో… గుచ్చారో… అని జగన్ గోల చేశారన్నారు. వచ్చి పోరాటం చేయండి. బయటకు వచ్చి తోలు తీయండి. ఆ ధైర్యం మీకు లేదుగ అని జగన్ను ఎద్దేవా చేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం ఆయన బహిరంగ సభ నిర్వహించారు. తమ పార్టీ నేతలకు ఏమైనా జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఐదురోజుల క్రితం రాజానగరం యాత్రకు వెళ్తా ఉంటే.. ఇసుక లారీ వచ్చి… నా కారును దాటి కాన్వాయ్ని గుద్దింది. అదే రోజున హైదరాబాద్లో దిగి ఇంటికెళ్తుండగా నాదెండ్ల మనోహర్ కారును మరో ఇసుక లారీ గుద్దేసింది. ఇది యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో అన్నది పోలీసులకే వదిలేశాం.
బాబూ లోకేశ్… మీరు పార్టీని నడిపే వ్యక్తి. ఇలాంటి కుతంత్రాలకు పాల్పడితే ఎలా? పోలీస్ శాఖను, డీజీపీని వేడుకుంటున్నా… వొకసారి అశాంతి వస్తే ఎవరి చేతుల్లో ఉండదుగగ అని పవన్ హెచ్చరించారు.