అమరావతిలో ఫార్ములా 1 పవర్ బోటింగ్ రేసులు

SMTV Desk 2018-11-16 11:38:48  Amaravati, Andrapradhesh, Formula 1 power boating race

అమరావతి, నవంబర్ 16: అమరావతి లో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి జరగబోయే ప్రపంచ వ్యాప్త ఫార్ములా1 పవర్ బోట్ రేసులకు అమరావతి వేదికైంది. మన దేశంలో వాణిజ్య రాజధాని ముంబై తర్వాత ఈ రేసులను నేటి నుంచి అమరావతి నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ, యుఐఎం ఎఫ్‌ఎ1హెచ్‌2ఓ వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆధ్వర్యంలో పవర్‌ బోటు రేసింగ్‌ శుక్రవారం మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు జెండా ఊపీ ప్రారంభించనున్నారు. మొత్తం తొమ్మిది జట్టులు పాల్గొంటున్న ఈ పోటీలలో అతిధ్య జట్టు గా అమరావతి పాల్గొంటుంది. ఈ రేసులకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లను పర్యాటక శాఖ చూసుకుంటోంది. పర్యాటక శాఖ ఎండీ హిమాన్షుశుక్లా, కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మికాంతం బందర్‌ రోడ్డులోని పర్యాటక శాఖ కార్యాలయం వద్ద జెండా ఊపి కంటైనర్లతో కూడిన బోట్ల ర్యాలీని గురువారం ప్రారంభించారు. బందర్‌ రోడ్డు మీదుగా డివి మ్యానర్‌ హోటల్‌ వరకు వెళ్లి తిరిగి పర్యాటక శాఖ కార్యాలయం వరకు కంటైనర్లు చేరుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌కు 200 మీటర్ల దూరంలో పున్నమి ఘాట్‌ నుంచి ప్రకాశం బ్యారేజ్‌ వరకు రేస్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3.35 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విధ దేశాలకు చెందిన బోట్లు కృష్ణా నదిలో ప్రేక్షకులను అలరిస్తాయి.



ఎఫ్‌1హెచ్‌2ఓ కు చెందిన ప్రధానమైన ఎఫ్‌4 రేస్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 2.50 గంటల వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 4.30 గంటల వరకు ఎఫ్‌1 అర్హత పోటీ నిర్వహిస్తారు. నవంబర్‌ 18న ఉదయం 11 గంటల నుంచి ఎఫ్‌4 ప్రాక్టీస్‌, ట్రయిల్స్‌, మధ్యాహ్నం 12.15 గంటలకు ఎఫ్‌1 వామప్‌ కొనసాగుతాయి. పోటీల్లో కీలకమైన ఎఫ్‌4 రేస్‌ మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 3.35 గంటల వరకు జరగనుంది. పర్యాటక రంగంలో ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా అమరావతి అన్ని ప్రాంతాన్ని సుందరీకరణ చేశారు. ఫ్లైఓవర్ బ్రిడ్జిలు మొదలుకుని రోడ్లకు ఇరువైపుల బ్యానర్లు రంగురంగుల జెండాలతో అమరావతి ఆథిత్యం ఇస్తుంది.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఎన్డీఆర్ఎఫ్, గత ఈతగాళ్లులతో పాటు, వైద్యనిపుణులను, భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు.