తిరుపతి, జూన్ 5 : కేంద్రప్రభుత్వంపై విన్నూతంగా నిరసన వ్యక్తం చేసే వారిలో తిరుపతి ఎంపీ శివప్రసాద్ ఒకరు. తాజగా ఆయన మరోసారి ప్రధాని మోదీ పై, ప్రతిపక్ష వైసీపీ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైకాపా నేతలు మాయ మాటలతో ప్రజలను ఎంతకాలం మోసగించలేరన్నారు. మోదీ దర్శకత్వంలో వైకాపా ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రజలందరి చెవుల్లో పువ్వులు పెట్టిందంటూ కమలం పువ్వులు చెవిలో పెట్టుకుని నిరసన తెలిపారు. స్వచ్ఛ్ భారత్ అని చెప్పే మోదీ.. తన నియోజకవర్గం వారణాసిని మాత్రం స్వచ్ఛంగా ఉంచలేకపోతున్నారని శివప్రసాద్ ఆక్షేపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును అడ్డుకోవాలని చూడటం తగదని అన్నారు. వైసీపీ ఎంపీలు తమ రాజీనామాలను ఆమోదించకుండా కేంద్రంతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉన్న చంద్రబాబుపై బురద జల్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. తమ పదవులకు రాజీనామా చేశామని చెప్పుకుంటున్న వైసీపీ ఎంపీలు జీతభత్యాలు ఎలా తీసుకుంటున్నారని శివప్రసాద్ ప్రశ్నించారు.