గుంటూరు, మే 31 : రెండు రోజులుగానిరసన కొనసాగిస్తున్న అగ్రిగోల్డ్ బాధితులు శాంతించారు. వారితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆత్మఘోష పాదయాత్ర పేరుతో శుక్రవారం తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమాన్ని విరమిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం వెల్లడించింది. మంత్రి ఆనందబాబు హామీతో శాంతించిన అగ్రిగోల్డ్ బాధితులు దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అగ్రిగోల్డ్ బాధితుల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావుకు మంత్రి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని.... బాధితుల సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని ప్రభుత్వ ప్రతినిధిగా చర్చలకు హాజరైన మంత్రి ఆనందబాబు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎప్పటిలోగా ఆర్థిక సహకారం అందించేది నిర్దిష్టంగా చెప్పాలని బాధితుల సంఘం డిమాండ్ చేయగా.... సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని... ఇవాళ మంత్రివర్గంలో దీనిపై చర్చ జరపనున్నామని మంత్రి వెల్లడించారు.