దాచేపల్లి, మే 12 : గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్దుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఎంతో సంచలనం రేపింది. ఆ ఘోరకలి మరువక ముందే అలాంటిదే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్ వలీ అత్యాచారం చేశాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60ఏళ్ల సుబ్బయ్య అనే వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. నిందితుడిని త్వరగా పట్టుకుని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. దీంతో భయపడిన నిందితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.