మెదక్, జనవరి 13 : రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలం కాసులాపూర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు అతి వేగంతో కాసులాపూర్ వద్ద డివైడర్ను దాటి ఎదురుగా నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో కారులోని ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడిన క్షతగాత్రులను రామాయంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలాన్ని తూఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు పరిశీలిస్తున్నారు.