మహబూబ్నగర్, అక్టోబర్ 20 : మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడి బండలో తండ్రి కొడుకులు గొడవలు పడి ఇద్దరు మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సింహులు(45), మన్నెమ్మ భార్యాభర్తలు. వీరికి దివ్యంగుడైన కుమారుడు బాలరాజు(20) ఉన్నాడు. నర్సింహులు మరో మహిళ లక్ష్మమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ఇటీవల నర్సింహులుకు పక్షవాతం రావడం వల్ల ఇల్లు గడవటం కష్టంగా మారింది. లక్ష్మమ్మ పాపను తీసుకొని పండుగకి పుట్టింటికి వెళ్ళింది. మన్నెమ్మ అడ్డాకుల సంతకు వెళ్ళగా ఇంట్లో తండ్రి కొడుకుల మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో నర్సింహులు కొడుకును ఇనుప రాడ్ తీసుకొని తలపై మోది చంపేశాడు. అనంతరం అతను ఉరి వేసుకొని మరణించాడు. మన్నెమ్మ వచ్చి పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.