తల్లి తిట్టిందని ఆత్మహత్య

SMTV Desk 2017-06-16 18:02:47  ravali, mothar, freind

నల్లబెల్లి, జూన్ 16 : ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద అని లేకుండా ఏ కారణానికైనా ఆత్మ హత్యలు చేసుకుంటారు కొందరు. పరీక్షలు, ప్రేమ, డబ్బు ఇలా చాలా కారణాల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లి తిట్టిందని ఆత్మహత్య చేసుకుంది ఓ విద్యార్థిని. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబెల్లికి చెందిన కొత్తపల్లి రాణి, బ్రహ్మచారిలకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమార్తె రవళి(19) నర్సంపేటలోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. గురువారం ఆమె స్నేహితురాలి వివాహం వెళ్ళడానికి ఖర్చులకు రూ.200 లు కావాలని తల్లి రాణిని అడుగగా రూ.100 ఇచ్చింది. మరో వంద రూపాయలు కావాలని రవళి తల్లిని అడగడంతో ఆవేశంలో నువ్వు పెళ్లికి వెళ్లొద్దని, డబ్బు లేదని హెచ్చరించి పొలం పనులకు వెళ్లింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రవళి ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు తెలిపారు. కొద్దిసేపటి తరువాత నోట్లో నుంచి నురుగు రావడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రశ్నించారు. పురుగుల మందు తాగినట్లు రవళి చెప్పడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా మారడంతో 108లో నర్సంపేటలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రవళి మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.