కాశ్మీర్, జూన్ 16: పాకిస్తాన్ మళ్ళీ భారత్ పై కాల్పులు జరిపింది. కాల్పుల్లో ఒక భారత జవాన్ మృతి చెందాడు. భారత్ చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బలు తింటున్నా తమ తీరును మార్చుకోవడం లేదు పాకిస్తాన్. తరుచూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ దుస్సాహసానికి పాల్పడుతోంది. ఈ రోజు కూడా కశ్మీర్లోని నౌషెరా సెక్టార్ ప్రాంతంలో పాక్ కాల్పులు జరిపింది. దీంతో భారత జవాను నాయక్ భక్తవార్ సింగ్ (34) ప్రాణాలు కోల్పోయాడు. పాక్ కాల్పులను భారత ఆర్మీ తిప్పికొడుతోంది. కాగా, ఈ రోజు జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై దాడికి దిగారు. భద్రతా బలగాలకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.