హైదరాబాద్, జూలై 24 : రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడి చేయడమే లక్ష్యంగా ఎక్సైజ్ శాఖ ముందుకు వెళ్ళుతుంది. ఇందులో భాగంగా సచివాలయంలో జిల్లా ఎక్సైజ్ అధికారులతో ఆ శాఖ కమిషనర్ చంద్రవదన్ తో పాటు ఎక్సైజ్ ఎన్స్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ లో కాకుండా ఇతర నగరాల్లో మాదకద్రవ్యాల కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయాలపై చంద్రవదన్ మీడియా తో మాట్లాడుతూ ..డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతున్న నేపధ్యంలో ఇప్పటి వరకు విచారణలో భాగంగా 27 మందిని ప్రశ్నించమని ఆయన తెలిపారు. అన్ని రంగాలకు చెందిన వారిని ఈ కేసులో విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓ వర్గాన్నే టార్గెట్ చేశామనడం సరికాదని అన్నారు. ఇప్పటి వరకు డ్రగ్స్ కేసులో 19 మందిని అరెస్ట్ చేయగా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చట్టానికి లోబడే ఈ దర్యాప్తు జరుగుతుందని, మాకు లీగర్ టీమ్ కూడా సాయం చేస్తోందన్నారు. సినీ రంగానికి చెందిన 12 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఐదుగురిని ప్రశ్నించామని, బలవంతంగా రక్త నమూనాలు తీసుకోవడం లేదని తెలిపారు. అపోహలతో కొందరు కోర్టుకు వెళ్లారని, హై కోర్టు నుంచి అధికారికంగా నోటీసులు రాలేదని పెర్కొన్నారు. సబర్వాల్ వివరణ .. చట్ట పరంగానే ఈ డ్రగ్స్ కేసును విచారిస్తున్నట్లు సబర్వాల్ మీడియాతో తెలిపారు. 2016లో మాకు అధికారాలు బదలాయించారు. డ్రగ్స్ విషయంలో ఇప్పటి వరకు 7 కేసులు నమోదు చేశామని, జానీ జోసెఫ్ సహా 19 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కేసును ప్రతి రోజు నలుగురు సభ్యుల టీమ్ ప్రశ్నిస్తుందన్నారు. డిపార్ట్ మెంట్ పరంగా అందరిని సమానంగా ట్రీట్ చేస్తున్నామని, విచారణ అంతా చిత్రీకరిస్తున్నామని తెలిపారు. వీడియో పూటేజ్ ను కోర్టు లో సమర్పిస్తామన్నారు. అనవసరంగా మాపై ఆరోపణలు చేస్తున్నారని, రాత పూర్వకంగా అనుమతి ఇచ్చిన తరువాతే.. శాంపిల్స్ తీసుకున్నామని వెల్లడించారు. నార్కోటిక్స్ నిఘా వర్గాల వారితో కలిసి పని చేస్తున్నామన్నారు. స్కూల్ పిల్లల పేర్లు బయట పెట్టమని, సుప్రీంకోర్టు గైడ్ లైన్ ని ఎక్కడా ఉల్లంఘించలేదని, డ్రగ్స్ కొనడం, అమ్మడం, వాడడం, అలవాటు చేయడం ఇంట్లో పెట్టికోవడం నేరమని వివరించారు.