సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం

SMTV Desk 2017-07-14 10:53:26  CM CAMP OFFICE, SUCIDE, SURYAPET, NAVYA, NAGARAAJU, SRINIVAAS, AMBULENCE.

హైదరాబాద్, జూలై 14 : సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదుట గురువారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన బానోత్‌ నాగరాజు(40) అనే రైతుకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిని గురుకులాల్లో చేర్పించి, తనకు ఏదైనా ఉపాధి చూపించాలని ముఖ్యమంత్రికి విన్నవించేందుకు నాలుగు రోజుల క్రితం నాగరాజు తన కుమార్తె నవ్య(13), మేనల్లుడు శ్రీనివాస్‌(18)తో కలిసి నగరానికి వచ్చారు. ఈ నాలుగు రోజులు క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కాగా గురువారం కార్యాలయం గేటు వద్దకు వచ్చి ముగ్గురూ వాంతులు చేసుకున్నారు. అది గమనించిన రక్షణ సిబ్బంది వారిని తనిఖీ చేయగా... వారి సంచిలోంచి పురుగుల మందు డబ్బా పడిపోవడంతో హుటాహుటీన బాధితులను అక్కడే ఉన్న అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాగరాజు, నవ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.