కత్తిపోట్లతో ఎస్పీ కార్యాలయానికి..

SMTV Desk 2018-04-15 13:22:20  mudder, knife attacked, sp office ananthapur

అనంతపురం, ఏప్రిల్ 15: కత్తిపోట్లకు గురై, తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని ఓ బాధితుడు నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఘటన శనివారం అనంతపురంలో చోటు చేసుకుంది. రక్తమోడుతున్న అతన్ని డీఎస్పీ వెంకటరావు చొరవతో ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం యాడికి మండలం రాయలచెరువులో శ్రీరామ్‌ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేసే రాజేష్‌ (35)పై ఉదయం హత్యాయత్నం జరిగింది. సొంత బావ రవిప్రసాద్, మరో వ్యక్తి ఈశ్వరయ్యతో కలిసి కత్తులతో దాడి చేశారు. విచక్షణా రహితంగా పొడిచేశారు. రక్తమోడుతున్న రాజేష్‌ను కుటుంబ సభ్యులు నేరుగా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రథమ చికిత్స అనంతరం నేరుగా అంబులెన్స్‌లో ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చారు. తన భర్తకు రక్షణ కల్పించాలని, యాడికి పోలీసులను వేడుకున్నా పట్టించు కోలేదని, క్షతగాత్రుడి భార్య భాగ్యలక్ష్మి ఎస్పీకి ఫిర్యాదు చేసింది.