హైదరాబాద్, ఏప్రిల్ 14: ఇంటర్ ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో బోర్డు అధికారులు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో తాజా ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫెయిలైతే అంతకుముందుకు ఆ సబ్జెక్టులో పాసైనా కూడా ఫెయిల్ అయినట్లే పరిగణిస్తారు. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు. ప్రథమ సంవత్సర విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉతీర్ణులైన వారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. సాధారణ ఫీజుతో పాటు ప్రతి పేపర్కు రూ.150 చొప్పున చెల్లించాలి. 2016 తర్వాత ఇంటర్ ఉత్తీర్ణులైన వారు రెండేళ్లలో రెండు సార్లు ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ద్వితీయ సంవత్సర పేపర్లను, ప్రాక్టికల్స్ రాసినా, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పేపర్లలో ఇంప్రూవ్మెంట్ రాస్తే.. గతంలో వచ్చిన మార్కులనైనా ఉంచుకోవచ్చు. తాజా మార్కులనైనా ఎంచుకోవచ్చు. కానీ ఒక సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చాయని వాటిని పరిగణనలోకి తీసుకోవడం కుదరదు.