హైదరాబాద్. ఏప్రిల్ 14: ఇంటర్లో అనుత్తీర్ణులమయ్యామని, తక్కువ మార్కులు వచ్చాయని నగరంలో నలుగురు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. శుక్రవారం ఫలితాలు విడుదలైన కాసేపటికే హైదరాబాద్లో వేర్వేరు చోట్ల నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని కన్నవారికి కడుపుకోత మిగిల్చారు. ఫెయిలయ్యామన్న మనస్తాపంతో ముగ్గురు, మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. దిల్సుఖ్నగర్లోని శ్రీ చైతన్య కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వనస్థలిపురం సుభద్రానగర్కు చెందిన వందన మార్కులు తక్కువ వచ్చాయన్న కారణంతో బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి పరిధిలోని ఖైత్లాపూర్కు చెందిన సాయికుమార్ పరీక్షల్లో ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిర్జాదిగూడకు చెందిన వర్ష అన్ని సబ్జెక్టులు తప్పానన్న మనోవేదనతో ఉరివేసుకుంది. గాజులరామారం ఉషోదయ కాలనీకి చెందిన మువ్వ శ్రీవిద్య నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిలైంది. విషయం తెలియడంతో వారు ఉండే అపార్ట్మెంట్ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.