హైదరాబాద్, ఏప్రిల్ 2 : వీ6 చానల్ న్యూస్లో యాంకర్ గా విధులు నిర్విహిస్తున్న వెంకన్నగారి రాధిక (36) ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. మూసాపేట్లోని గూడ్స్షెడ్ రోడ్డు శ్రీవీలా అపార్టుమెంట్ రెండో ఫ్లోర్ 204 ఫ్లాట్లో నివసిస్తుంది. ఆమె ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికొస్తూనే అపార్టుమెంట్ 5వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంది. ఆమె బ్యాగులో సూసైడ్ లెటర్ లభ్యమైంది. ‘కేవలం నా మానసిక ఒత్తిడివల్లనే తనువు చాలించానని, నా మెదడు నా శత్రువు’ అని నోట్లో రాసి ఉంది. ఆరు నెలల కిందట భర్త నుంచి రాధిక విడాకులు తీసుకుంది. బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న తన 14 ఏళ్ల కుమారుడు, తల్లిదండ్రులతో కలసి ఆమె అపార్ట్మెంట్లో నివాసముండేది. రాధిక ఆత్మహత్య సమాచారం అందిన వెంటనే కూకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆమె వద్ద లభించిన లేఖను బట్టి మానసిక ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.