పంజాబ్, జూన్ 29 : అపసవ్య దిశలో వస్తున్న వాహనదారుడిని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ పై వీరంగం ప్రదర్శించిన ఘటన పంజాబ్ లోని పాటియాలాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వివాదాస్పదంగా మారాయి. ఇరవై తొమ్మిది సంవత్సారాల వయస్సు ఉన్న హిమాన్షు మిత్తల్ అనే వ్యక్తి తన బీఎండబ్ల్యూ కారులో అపసవ్య దిశలో వచ్చాడు. దీనిని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఓంప్రకాష్, మిత్తల్ కారును అడ్డగించి, లైసెన్స్, వాహన సంబంధిత పత్రాలు చూపించాలని కోరాడు. అందుకు నిరాకరించిన మిత్తల్ ఓంప్రకాశ్ ను దూషించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా కానిస్టేబుల్ పై చేయి చేసుకోవడంతో వీరివురి మధ్య వాగ్వాదం కాస్త విపరీతమైన ఘర్షణకు దారి తీసింది. ఈ గొడవను గమనిస్తున్న స్థానికులు వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనాస్థలి చేరుకొని హిమన్షును నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి రిమాండ్ కు తీసుకెళ్ళారు.