హైదరాబాద్, జనవరి 24 : తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ౦గా ప్రారంభించిన టీహబ్లోని అంకుర పరిశ్రమ "బనియన్ నేషన్".. డెల్ పీపుల్స్ ఛాయిస్ పురస్కారాన్ని దక్కించుకొంది. ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం అనే అంశంపై ఏర్పాటైన ఈ స్టార్టప్.. ఆరు సంస్థలను అధిగమించి ఈ అవార్డును కైవసం చేసుకోవడం విశేషం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం-2018 సందర్భంగా పీపుల్స్ ఛాయిస్ అవార్డు కోసం వివిధ స్టార్టప్లను అనేక దశల్లో వడపోసింది. తుది దశకు ఎంపికైన ఆరు సంస్థల్లో భారత్ నుంచి బనియన్ నేషన్ ఒకటే ఎంపికైంది. ఈ నేపథ్యంలో పీపుల్స్ ఛాయిస్ పురస్కారానికి ఎంపిక కావడంపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఆ సంస్థకు అభినందనలు తెలిపారు.