హైదరాబాద్, జనవరి 20 : మహిళలు వేధింపులకు గురికాకుండా, ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య పేర్కొన్నారు. ఈ ఉదయం గచ్చిబౌలి స్టేడియం వద్ద సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో మహిళల భద్రత అనే అంశంపై "షీ వాక్" ను ప్రారంభించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కుల కోసం పోరాడాలని, వేధింపులకు పాల్పడే వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఐటి కారిడార్లో మహిళల రక్షణ నిమిత్తం నిరంతరం సివిల్ డ్రెస్సుల్లో పోలీసులు అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్య ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ గైనకాలజిస్ట్, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంజుల అంగనీ మాట్లాడుతూ.. మహిళల సాధికారిత, భద్రతపై అవగాహన కలిగించడానికి నిర్వహించిన నడకకు మహిళల నుండి మంచి స్పందన వచ్చిందన్నారు.