హైదరాబాద్, జనవరి 13 : ప్రవాసీయుల సమస్యలపై దృష్టి సారించాలని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పోలీసులు, అధికారులను ఆదేశించారు. హోంమంత్రి నాయినితో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి హైదరాబాద్ పోలీసులు కమిషనర్ తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రవాసీయుల సమస్యలపై మూడు రోజుల క్రితం కేంద్ర విదేశాంగ శాఖమంత్రి సుష్మాస్వరాజ్ ను కలిసిన కేటీఆర్ ఆమెతో చర్చల సారాంశాన్ని వివరించారు. విదేశాల్లో పదేపదే తప్పులు చేసేవారి పాస్ పోర్టును రద్దు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదన తెలిపామన్నారు. రాష్ట్రంలో అనధికార ఏజెంట్లు విదేశాల్లో ఉద్యోగాల పేరిట పల్లె వాసులను మోసం చేస్తున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. పాతబస్తీలో అరబ్ షేక్ లు బాలికలను వివాహాలు చేసుకుంటున్న ఘటనలకు అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. అలాంటి చర్యలకు పాల్పడకుండా ఒరిస్సా, మహారాష్ట్ర అధికారులతో కలిసి చర్యలు చేపట్టాలని సుష్మా సూచించారని కేటీఆర్ వివరించారు. బోగస్ ఏజెంట్ల బారినపడి మోసపోకుండా థియేటర్లలో ప్రకటనలు ఇవ్వాలని హోంశాఖకు ఆయన ఆదేశాలిచ్చారు.