హైదరాబాద్, జనవరి 10: ప్రేమించని పాపానికి ప్రాణాలు తీశాడు ఓ ప్రేమోన్మాది. తను ప్రేమించిన అమ్మాయినే కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) కేపీహెచ్బీలోని డీమార్ట్ సూపర్మార్కెట్లో పనిచేస్తోంది. మూసాపేట హబీబ్నగర్లో ఓ అద్దె ఇంట్లో రూప అనే మరో యువతితో కలసి ఉంటోంది. జానకి పనిచేస్తున్న సూపర్మార్కెట్లోనే రంగారెడ్డి జిల్లాకు చెందిన అనంతప్ప అలియాస్ ఆనంద్ కూడా పనిచేస్తున్నాడు. గత కొద్దికాలంగా తనను ప్రేమించాలంటూ జానకిని వేధిస్తున్నాడు. అయితే అతడి ప్రేమను జానకి తిరస్కరించింది. దీంతో ఆగ్రహానికి గురై మంగళవారం సాయంత్రం రూప ఇంటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న జానకిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినప్పటికి పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.