హైదరాబాద్, జనవరి 2 : ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ ను లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. డిసెంబర్ 29న పంజాగుట్ట పోలీస్స్టేషన్లో రేడియో జాకీగా పని చేస్తున్న మహిళ గజల్ శ్రీనివాస్ తనను లైంగికంగా వేధించినట్లు పక్క ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి మంగళవారం ఉదయం అదుపులోకి తీసుకోని విచారించారు. కేసులో భాగంగా పోలీసులు ఆయనను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి ఈ నెల 12 వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. దీనిపై స్పందించిన శ్రీనివాస్.." నా పై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదు. ఆ ఆమ్మాయి నా పై ఎందుకు ఫిర్యాదు చేసిందో అర్థం కావడం లేదు. నా భుజానికి దెబ్బ తగిలితే ఆమె మందు రాసిందే తప్ప ఆమెతో మసాజ్ చేయించుకున్నానన్న వార్తల్లో వాస్తవం లేదు" అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా గజల్ శ్రీనివాస్పై వచ్చిన ఆరోపణలు నిజమేనని పంజాగుట్ట ఏసీపీ వెల్లడించారు. యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా లైంగిక వేధింపులకు పాల్పడటం, గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించినట్లు తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.