హైదరాబాద్, డిసెంబర్ 29 : వీఆర్వో(గ్రామ రెవెన్యూ అధికారి) లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాని ఒక షరతు.. ఇంటర్ విద్యార్హతతో 2014 మే 12వ తేదీ తర్వాత వీఆర్వోలుగా నియమితులైన వారు ఐదేళ్లలోపు డిగ్రీ ఉత్తీర్ణులైతేనే సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించనున్నారు. అనగా 2019 మే 12వ తేదీలోగా డిగ్రీ పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా జీవోనెం.299ను జారీ చేశారు. దీనికోసం 2012 ఆగస్టు 13న జారీ చేసిన జీవోనెం.514తో పాటు తెలంగాణ స్టేట్ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్-1998లో కూడా పలు సవరణలు చేయనున్నారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసెస్ అసోసియేషన్(ట్రెసా) అధ్యక్షుడు శివశంకర్, అధికారుల సంఘం ప్రతినిధులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.