గద్వాల, డిసెంబర్ 29 : వరుస దొంగతనాలకు పాల్పడుతూ, ఇప్పటికీ 100 చోరీలకు పైగా చేసిన ఓ గజదొంగ కుటుంబాన్ని, పోలీసులు ఈ నెల 28న, అదుపులోకి తీసుకున్నారు. గద్వాల అదనపు ఎస్పీ భాస్కర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం...ముంబైలోని ఓ చేపల మార్కెట్లో రోజుకూలీగా చేసే బోయ సోమశేఖర్, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీరాంపురం కాలనీలో నివాసం ఉంటూ, తన భార్య ఉసేన్బీ, అత్త ఖాజాబీ, మరదలు రసూల్బీలతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి, దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో దొంగతనం కేసులు, ఓ హత్య కేసు కుడా ఉంది. ఇటీవల గద్వాల కొత్త హౌసింగ్బోర్డు కాలనీలో ఇద్దరి ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. అయితే, పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా, మళ్లీ ఈ నెల 27న కూడా సాయంత్రం దొంగతనాలు చేసేందుకు గద్వాలకు రైళ్లో తిరిగి వస్తుండగా పోలీసులు వారిని చేజిక్కించుకున్నారు. వీరి నుంచి 47 తులాల బంగారం, అలాగే 1.65 కేజీల వెండిని స్వాధీనం చేసుకుని ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.