హైదరాబాద్, డిసెంబర్ 27: తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అతని భార్య వనితారెడ్డి బుధవారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు లొంగిపోయారు. విజయ్ ఆత్మహత్య చేసుకోక ముందు ఒక సెల్ఫీ వీడియోలో తన మరణంకు భార్య వనితతో పాటు, మరో ఇద్దరు కారణమని, వారిని వదిలిపెట్టదని వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో వనితపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. గత కొద్ది రోజులగా పరారీలో ఉన్న ఆమె ఈ రోజు విచారణకు హాజరయ్యారు. పోలీస్ స్టేషన్ ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.."విజయ్ ఆత్మహత్యతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అతను సెల్ఫీలో వాస్తవాలు చెప్పలేదు. విజయ్ నా పేరు ఎందుకు చెప్పాడో తెలియదు. తల్లిదండ్రుల వేధింపుల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్ష్యాల కోసమే ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నా. పోలీసులకు అన్ని సాక్ష్యాధారాలు సమర్పించడానికి ఇక్కడకు వచ్చాను" అని వెల్లడించారు.