ఆస్ట్రేలియాలో తెలంగాణా వాసి మృతి...

SMTV Desk 2017-12-26 12:31:48  Australia, suryapeta, infosys,

సూర్యాపేట, డిసెంబర్ 26: విదేశాలలో ఉన్న తన భర్తతో సరదాగా మాట్లాడుదామని భార్య ఫోన్ చేస్తుంది. కానీ అప్పటికే విగత జీవిగా పడి ఉన్నాడని ఆమెకు తెలియదు. అసలు ఏం జరిగిందంటే... సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఇంజంవారిగూడెంకు చెందిన కోన ఆదినారాయణరెడ్డి కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్నారు. ఆరునెలల క్రితమే కంపెనీ వారు ఆయన్ను సిడ్నీకి పంపారు. నిరుపేద రైతు కుటుంబంలో పుట్టిన ఆదినారాయణరెడ్డి కష్టజీవి. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరో నెలరోజుల్లో భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆదివారం రాత్రి, తన భర్తతో మాట్లాడుదామని భార్య శిరీష, పలుమార్లు ఫోన్‌ చేసినా జవాబు లేకపోవడంతో ఆమె కంగారు పడింది. ఆ తరువాత సోమవారం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఆదినారాయణరెడ్డి స్నేహితుడు రామ్‌కుమార్‌కు చెప్పగా, ఆయన వెళ్లి చూడగా గదిలో నిర్జీవంగా కనిపించాడు. ఈ విషయ౦ తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్తను కడసారిగా చూసుకోవాలని, అక్కడి నుంచి మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని శిరీష ప్రాదేయపడుతుంది.