హైదరాబాద్, డిసెంబర్ 25 : శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆయన సతీమణి, కుమారై లకు ఘనంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాగా, వీరందరూ విందారగిస్తున్న సమయంలో ఇండియన్ ఐడల్-9 సీజన్ విజేత ఎల్వి రేవంత్ తన పాటలతో అలరించారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "బాహుబలి" చిత్రంలోని ‘ఎవ్వడంటా ఎవ్వడంటా నిన్ను ఎత్తుకుంది" అంటూ సాగే పాటను ఆలపించి పసందైన విందులో రాష్ట్రపతికి వినోదాన్ని అందజేశారు.