హైదరాబాద్, డిసెంబర్ 24 : నేడు తర్నాక నుంచి అమీర్పేట వరకు పరిశీలన నిమిత్తం వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మెట్రోరైలు ఛార్జీలు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. తర్నాక నుంచి అమీర్పేట వరకు ప్రయాణించిన ఆయన ఈ సందర్భంగా ప్రయాణికులతో మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి వివరణ సేకరించి మెట్రోరైలు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే, పాతబస్తీలో మెట్రోరైల్ పనులు వెంటనే చేపట్టాలని వెల్లడించారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రోరైల్ కొనసాగిస్తే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా స్టేషన్లలో పార్కింగ్ సమస్యను మెరుగు పరచాల్సిందిగా పేర్కొన్నారు.