హైదరాబాద్, డిసెంబర్ 22 : తెలంగాణా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభల పై టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. రాష్ట్ర యాస, భాష కోసం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం జరిగింది. సొంత రాష్ట్రం వచ్చాక యాసని కాపాడుకునేందుకు ప్రపంచ తెలుగు మహాసభలని నిర్వహించాల్సింది. ఆ దిశగా ప్రయత్నం ఎక్కడా జరగలేదు అని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..."ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యవాదాన్ని కాపాడుకునేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించారు. తెలంగాణ యాస, భాష అస్తిత్వాన్ని కాపాడడంలో ముందున్న వారిలో ఎందరో వ్యక్తులును తెలుగు మహాసభల్లో భాగస్వామ్యం కల్పించలేదన్నారు. కానీ గద్దర్, విమలక్క, అందెశ్రీ, మిత్రలాంటి వాళ్లని సభకు ఆహ్వానించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆదివాసీలు, గిరిజనులు, మధ్య ఘర్షణలు తలెత్తాయి." అని వ్యాఖ్యానించారు. కాగా టీజేఏసీ చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్ర ఏడో దశ శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు నల్లగొండ జిల్లాలో కొనసాగుతుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.